అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేయడం తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జిన్నా టవర్ సెంటర్కు అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని ఆయన సూచించారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని గురువారం ఆయన కోరారు.
జిన్నా టవర్ సెంటర్పై బీజేపీ జాతీయ నాయకుడు సత్యకుమార్ ట్విట్ ద్వారా మొదలు పెట్టిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సోము వీర్రాజు మాట్లాడడం, మరో వైపు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ విభజనకు కారణమైన వారి పేర్లను పెట్టడం సరైనది కాదని వారన్నారు. బుధవారం సోము వీర్రాజు మాట్లాడుతూ .. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ను ఇస్తామని ప్రకటించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.