Srisailam : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి దేవస్థానంలోని సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తమ విధులను సమర్ధంగా నిర్వర్తించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
సున్నిపెంట హెలిప్యాడ్, శ్రీశైల ప్రధానాలయం, టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్, శివాజీ స్ఫూర్తి కేంద్రాల్లో విధుల్లో ఉండే అధికారులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డీఆర్ఓను ఆదేశించారు. అంతేకాదు అధికారులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ఆదివారం ఉదయం నిర్వహించే ట్రయల్ రన్ లో తమకు కేటాయించిన ప్రదేశాల్లో ఉండాలని సంబంధిత అధికారులకు తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తీర్థ ప్రసాద వితరణను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు, సూపర్ వైజర్లను నియమించాలని డీపీఓ, ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్కు సూచించారు. నాలుగు ప్రదేశాల్లో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రాష్ట్రపతి విడిది ఏర్పాట్లలో పొరపాట్లకు తావివ్వకూడదని దేవస్థాన ఈఓకు కలెక్టర్ సూచించారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికాలని ఈఓ లవన్నను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే రహదారిలో గుంతలు లేకుండా చూడటంతో పాటు సైడ్ లో వైట్ పెయింటింగ్ తో మార్కింగ్ ఇవ్వాలని ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చెంచు విద్యార్థుల సుస్వాగత నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని సమన్వయంతో కృషి విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ట్రయిల్ రన్ నిర్వహించి అధికారులకు, పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఎం దాసు సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.