అమరావతి : జగన్ సర్కారు స్థానిక సంస్థల నిధులు దోచి ఆర్థిక సంక్షోభం సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ లకు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేశారన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను కూడా రానివ్వకుండా చేసి జగన్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం సృష్టించిందని తెలిపారు. సోమవారం తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఈ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది. గతంలో మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడతామన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్న చెక్ పవర్ తీసేసింది. నిధులు దుర్వినియోగం చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు తీసుకుపోయింది. ఈ పరిస్థితిని జనసేన పార్టీ ఖండిస్తోందని మనోహర్ అన్నారు.