కడపలో విమానాశ్రయం ఏర్పాటుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. కడప జిల్లా అన్నా, కడప ప్రజలన్నా తనకు అభిమానం ఉన్నదని తెలిపారు. కడప ప్రజలకు హత్యారాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కేవలం వైఎస్ వివేకానందరెడ్డి హత్యను మాత్రమే ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన.
రాయలసీమ జిల్లాల్లో ఎయిర్పోర్టుకు సంబంధించి సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. రాయలసీమకు చెందిన పలువురు నేతలు సోము వీర్రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. తక్షణమే కడప జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
వివాదం కాస్తా ముదిరి పాకాన పడటంతో సోము వీర్రాజు తన వ్యాఖ్యలపై శుక్రవారం సాయంత్రానికి వివరణ ఇచ్చారు. వివేకా హత్యను దృష్టిలో ఉంచుకునే తాను అలా మాట్లాడానని చెప్పారు. కడప ప్రజలకు, హత్యా రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. తాను అనని మాటలను కొందరు పనిగట్టుకుని వ్యాప్తి చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.