హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సీమ ప్రాజెక్టును సందర్శించి నివేదిక సమర్పణకు అదనంగా గడువు ఇచ్చేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 13లోగా నివేదిక సమర్పించాల్సిందేనని ఎన్జీటీ చెన్నై బెంచ్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని ఆదేశించింది. ప్రాజెక్టు సందర్శనను తాత్సారం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం సీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ గడువు సోమవారం ముగియనుండగా.. మరో మూడు వారాల గడువు కోరుతూ కేఆర్ఎంబీ మధ్యంతర పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. కేఆర్ఎంబీ తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయో? లేదో? పరిశీలించేందుకు ఇంజినీరే అక్కర్లేదని.. లాయర్నైనా తీసుకెళ్లవచ్చని చురక అంటించింది. మూడు వారాల గడువు ఇచ్చే ప్రసక్తే లేదని.. ఈనెల 13లోగా నివేదిక సమర్పించాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. పిటిషన్ విచారణను 16వ తేదీకి వాయిదావేసింది.