Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు భృంగి వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్లో రెండోరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ వేదపండితులు, అర్చకులు యాగశాలలో శ్రీచండీశ్వర స్వామి, జపాలు, పంచావరణార్చనలు, నిత్యవాహనాలు, రుద్రహోమం, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం ప్రదోష కాలపూజలు, హోమాలు, జపానుష్టానాలు జరిపించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకరమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణలో భృంగివాహనంపై వేంచేంబు చేసి ప్రత్యేక పూజలు, పుష్పార్చనాధి క్రతువులు చేశారు. గ్రామోత్సవంలో భాగంగా భృంగివాహనాధీశులైన స్వామి అమ్మవార్లను గంగాధర మండపం నుండి నందిమండపం మీదుగా బయలు వీరభద్రస్వామి వరకు ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, హరిదాసులు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. గ్రామోత్సవంలో కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజుతో పాటు ఈఈ రామకృష్ణ పౌరసంభందాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు మోహన్, హరిదాస్, ఫణీంధ్ర ప్రసాద్,మల్లికార్జున రెడ్డి, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, సిఎస్ఓ అయ్యన్న, పర్యావేక్షకులు రవి, మధుసూదన్రెడ్డి, స్వాములు సిబ్బంది పాల్గొన్నారు.
హిందూ సంప్రదాయ సనాతనధర్మంలో భాగంగా శనివారం సంప్రదాయ బద్ధంగా భోగి పండుగను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదేండ్ల లోపు వయస్సుగల చిన్నారులకు సామూహికంగా భోగిపండ్లు వేయనున్నట్లు చెప్పారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకున్నవారితో పాటు భక్తుల పిల్లలు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీని వల్ల పిల్లలకు బాలారిష్టదోషాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.