Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని ముద్రగడ వాయిదా వేసుకున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి కార్లలో ర్యాలీగా వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాపు సోదరులకు ముద్రగడ ఓ లేఖ రాశారు.
తాను వైసీపీలో చేరతానని ప్రకటించిన తర్వాత.. ఊహించిన దానికంటే కూడా భారీ స్థాయిలో స్పందన వచ్చిందని ముద్రగడ లేఖలో తెలిపారు. అయితే సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికే కాదు.. కనీసం నిలడడానికి కూడా స్థలం సరిపోదని.. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరినీ చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడంతో తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ఒక్కడినే వెళ్లి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని వెల్లడించారు. అందర్నీ నిరుత్సాహపరిచినందుకు క్షమించాలని అభిమానులను కోరారు. మీ అందరి ఆశీస్సులు తప్పకుండా అందించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.