న్యూఢిల్లీ: విదేశాల నుంచి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో తిరుమల, తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) విదేశీ విరాళాలు అందడం లేదని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీకి సంబంధించి విదేశీ విరాళాలను సేకరించేందుకు అవసరమైన ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.
తిరుమల, తిరుపతి దేవస్థానం అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, అయితే ఈ కార్యాకలాపాలకు భారీస్థాయిలో నిధులు అవసరమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తిరుమలకు విదేశాల నుంచి ప్రవాస భారతీయులు నిత్యం పెద్ద మొత్తంలో విరాళాలుగా పంపిస్తుంటారని, ఆ నిధులతోనే టీటీడీ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు.
అయితే, కేంద్ర హోంశాఖ ఇటీవల విదేశీ సహకారం నియంత్రణ చట్టం లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేయడంతో టీటీడీకి వచ్చే విదేశీ విరాళాలు నిలిచిపోయాయని విచారం వ్యక్తం చేశారు. తగిన పత్రాలు సమర్పించినప్పటికీ వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ టీటీడీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను కేంద్ర హోంశాఖ రెన్యువల్ చేయడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా కేంద్రం తగు చర్యలు తీసుకుని టీటీడీకి ఎఫ్సీఆర్ఏ లైన్స్ను పునరుద్ధరించి ధార్మిక, సేవా కార్యక్రమాలు జరిపేలా చూడాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తిచేశారు.