అమరావతి : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు. పార్లమెంట్లో ఆమోదించిన నూతన రాజధాని ఏర్పాటు చట్టానికి అసెంబ్లీలో సవరణ కుదరదని పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన ఆమోదం పొందాలంటే తిరిగి పార్లమెంటులోనే చట్టాన్ని సవరించాలని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3 రాజధానుల ప్రతిపాదనపై స్టే ఇచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. నీటి వివాదంలాగే 3 రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని ఎంపీ లేఖలో కోరారు. ఏపీ ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. 15వ తేదీ వచ్చినా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నది. గతంలో ఎప్పుడూ లేని ఆర్థిక దుస్థితి ఏపీలో ఉందని రఘురామ పేర్కొన్నారు.