న్యూఢిల్లీ: ఏపీ ఫైబర్ నెట్పై ( AP fibernet ) తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నారు. కాగా, మంత్రికి రాసిన లేఖలో.. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్ఓ లైసెన్స్ ఉపయోగిస్తున్నదని ఎంపీ రఘురామ తెలిపారు.
అంతేగాక, ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్ఓ లైసెన్స్ పొందలేవని ఆయన గుర్తుచేశారు. ఏపీ ఫైబర్నెట్ను అనర్హత జాబితాలో చేర్చాలని మంత్రిని కోరారు. తక్షణమే దానిపై చర్యలు తీసుకుని అక్రమ లైసెన్స్ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన లేఖలో డిమాండ్ చేశారు.