Nandigama Suresh | ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇస్తారని ఎంపీ నందిగం సురేశ్ తెలిపారు. ప్రజల్లో లేకపోతే తనకు కూడా టికెట్ ఉండదని స్పష్టం చేశారు. అనంతపురంలో కొనసాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్యే శంకరనారాయణతో కలిసి ఎంపీ నందిగం సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమన్వయకర్తల నియామకానికి కులాలను అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు జగన్ పెద్దపీట వేశారని అన్నారు. కాంగ్రెస్లో ఎవరు ఉన్నా తమ ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు.
సామాజిక సాధికార బస్సు యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు. 14 ఏండ్ల చంద్రబాబు పాలనకు.. నాలుగేండ్ల జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని అన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం జగన్కు ఉందని తెలిపారు. అదే వెన్నుపోట్లతో రాజకీయాల్లో పైకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నట్లుగా చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.