తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను (Mobile containers ) గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక కంటైనర్ను జీఎన్సీ వద్ద టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు (Drivers ) విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. మరో కంటైనర్ ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల (Tirumala) లో గదుల లభ్యత పరిమితంగా ఉందని, నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని చెప్పారు. పలుచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని, ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పారు.
ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్సుపోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, డిఐ జానకిరామిరెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
నూతన విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్
తిరుమలలో అన్నమయ్య భవనం ఎదురుగా నిర్మించిన కావేరి విశ్రాంతి గృహాన్ని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఏవి.ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షులు భాస్కర్ రావు విరాళంతో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోను దాత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, విజివోలు బాలిరెడ్డి, గిరిధర్ రావు పాల్గొన్నారు