విజయవాడ: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది.
తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సోమవారం రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. పోలీసుల నిబంధనల ప్రకారం 90 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయని కారణంగా సీఆర్పీసీ 167 బీ ప్రకారంగా తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరుచేయాలని కోర్టును కోరారు.
అయితే, నిబంధనల ప్రకారమే గడువులోపే పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఛార్జీషీట్లో తప్పులున్నాయన్న సాంకేతిక కారణాల వల్ల దానిని కింది కోర్టు తిరస్కరించిందని చెప్పారు. నిర్ణీత సమయంలోపే అభియోగపత్రం దాఖలు చేసినట్లే అని తెలిపారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఇరువాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.