అమరావతి : ఏపీలో సంచలనం రేపిన కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరత్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది . రూ. 25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. నిన్న అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.
ఈనెల 25 మధ్యాహ్నం రెండు గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. మూడు రోజులు స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రావద్దని సూచించింది. పోలీసులు అనంతబాబుతోనే ఉండాలని, కేసు విషయంపై ఎక్కడా ప్రస్తావించకూడదని అంత్యక్రియలకు మాత్రమే బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది .
మే 19న రాత్రి కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం అనంతబాబు మే 23న అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. హత్య కేసుపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. స్పందించిన మానవహక్కుల సంఘం ఆదేశాల మేరకు 5రోజుల క్రితం ఎమ్మెల్సీ అనంతబాబుపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.