గుంటూరు జిల్లా: వైసీపీలో నాయకుల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ఇంఛార్జీగా ఉన్న మేకతోటి సుచరితపై తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహంతో ఊగిపోయారు. సుచిరితపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఆమె నివాసం వద్ద అర్ధరాత్రి ధర్నాకు దిగారు. కాంగ్రెస్నే వీడి కొంత కాలం క్రితం వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకమే దీనికంతటికీ ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మాజీ మంత్రి మేకతోటి సుచరితపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా పదవులు కట్టబెట్టడంపై ఆమె ఆగ్రహంతో ఉన్నారు. సుచరిత నిర్ణయంపై వైసీపీ అగ్రనాయకులకు సైతం ఫిర్యాదు చేసిన శ్రీదేవి.. శుక్రవారం అర్ధరాత్రి సుచరిత ఇంటికి చేరుకుని బైఠాయించింది. సుచరిత విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగింది. తాడికొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు తెలియకుండానే అదనపు ఇంఛార్జీని నియమించడంపై ఆమె అగ్రహోదగ్రులవుతున్నారు. నియోజకవర్గం అదనపు ఇంఛార్జీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడం తనను అవమానించడమే అని ఆరోపించారు.
తన ఇంటి వద్ద ధర్నాకు దిగిన శ్రీదేవిని నిరసన విరమించాలని సుచరిత కోరింది. ఈ విషయంపై పార్టీ హైకమాండ్తో మాట్లాడతానని శ్రీదేవికి నచ్చజెప్పింది. దాంతో ఎమ్మెల్యే శ్రీదేవి తన నిరసనను విరమించారు. ఎమ్మెల్యే శ్రీదేవికి తాడికొండకు చెందిన నేతలు అండగా నిలిచారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 గంటల్లోగా పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాజీనామా చేస్తామని నాలుగు మండలాల నేతలు ప్రకటించారు.