నగరి: తన అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, నగరి ఓటర్లు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరని చెప్పారు. తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ.. నగరిలోనే ఉంటా.. నగరిలోనే చచ్చిపోతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనపై గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు. గాలి భాను ప్రకాష్ కావాలనే తనపై ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాను పార్టీకి రాజీనామా చేసి తెలంగాణకు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు.
తాను హీరోయిన్గా ఉన్నప్పుడు మద్రాసులో, వైసీపీలో చేరకముందు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నగరిలో కూడా సొంతిల్లు కట్టుకున్నట్లు స్పష్టం చేశారు. నగరిలోనే ఉంటాను, నగరిలోనే చచ్చిపోతాను అని రోజా భావోద్వేగంతో చెప్పారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెనకే ఉన్నానని, అలాంటి తనకు పార్టీ వీడే అవసరమే లేదన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నానన్నారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశానని చెప్పారు. తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానని రోజా అభిప్రాయపడ్డారు.