ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్రలో అపశృతి దొర్లింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రమాదవశాత్తు సైకిల్ పైనుంచి జారి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. కాస్పేపు విరామం తీసుకున్న తర్వాత తిరిగి యాత్రను కొనసాగించారు. ఈ ఘటన దెందులూరు మండలం శింగవరం దగ్గర జరిగింది.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు. పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల నుంచి అమరావతిలోని అసెంబ్లీ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఆవేదనను తెలియజేసేందుకు, ఈ సమస్యను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్య ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. కాగా, శింగవరం వద్దకు చేరగానే ఏలూరు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సైకిల్ తాకి ఎమ్మెల్యే నిమ్మల కిందపడిపోయారు. అయితే, ఎమ్మెల్యేకు గాయాలేవీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి సైకిల్ యాత్రను చేపట్టారు.
అలాగే, పాలకొల్లులోని టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర 36 గంటల ఇంటి దీక్ష చేపట్టారు. తమ ప్రభుత్వంలో 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ.. మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోతోందని ఎమ్మెల్యే నిమ్మల విమర్శించారు. టిడ్కో ఇళ్ళు ఉచితంగా ఇస్తామని ఆనాడు పాదయాత్రలో చెప్పిన జగన్.. ఇవాళ బ్యాంకు ఋణాల పేరు చెప్పి అమ్ముకొంటున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. కార్యాలయాలు, ఇళ్లకు రంగులు వేయడంపై ఉన్న ప్రేమ, పేదల ఇళ్ళు పూర్తి చేయడంపై సీఎం జగన్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు రంగుల పిచ్చి ఉంటే.. తాడేపల్లి రాజప్రాసాదానికి, ఇడుపులపాయ ఎస్టేట్కు, లోటస్ పాండ్కు, బెంగుళూరు ప్యాలెస్కు రంగులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఒక్క ఇటుక కూడా పెట్టని జగన్కు చంద్రబాబు కట్టిన ఇళ్లకు రంగులు వేయడం మాత్రం కావాలా? అంటూ ప్రశ్నించారు.