నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అచ్చం అలాంటి వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తమకు శత్రువులుగా ఉన్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వీరి ఆరోపణల నేపథ్యంలో ఎవరా సీనియర్లు అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్కు బంధువైన బాలినేని ఇలాంటి ఆరోపణలు ఊరికే చేయరనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నేతలపై ఆ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొందరు తమ, తమ నియోజకవర్గాల్లో పని చేసుకోకుండా వాటిని గాలికొదిలేసి ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నదని వాపోతున్నారు. కష్టపడే వారిపైనే కుట్రలు చేస్తున్నారని, సీజనల్ నేతలే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తానూ ఇబ్బంది పడుతున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. అజాత శత్రువులాంటి బాలినేనిపైనే సొంత పార్టీనేతలు కుట్ర చేయడమేంటని విచారం వ్యక్తం చేశారు. కొందరు ముఖ్యనేతలు, సీనియర్ నేతలు తనను బలహీనపర్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం రాగానే వాతలు పెట్టడం ఖాయమన్నారు.