మంగళగిరి: రాజకీయ కక్షసాధింపులు తప్ప సీఎం జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని హిందూపుం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ (Balakrishna) అన్నారు. చంద్రబాబును (Chandrababu) జైళ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ స్కామ్ను సృష్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతి జరిగిందని బాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ప్రతిపక్ష నేతపై కక్ష సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నదని విమర్శించారు. అవినీతి జరిగితే ఛార్జీషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అక్రమాలు జరిగితే ఆధారాలు చూపించాలి కదా అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై బాలకృష్ణ మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం వేలాది మంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా అన్నారు. తన నియోజకవర్గం హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు.
డిజైన్ టెక్ (Design Tech) సంస్థకు జగన్ ప్రభుత్వం (CM Jagan) అభినందన లేఖ ఇచ్చిందని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ ముందుగా గుజరాత్లో ప్రారంభించారని చెప్పారు. సీఎం కేవలం పాలసీ మేకర్ మాత్రమేనని, అధికారులే పథకాలను అమలు చేస్తారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) స్కీమ్ను అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రమ్చంద్రారెడ్డి అమలు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసిందని, 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారన్నారు.
ఎలాంటి ఆధారాలు చూపించకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద విద్యార్థుల కోసం ఆయన ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని చెప్పారు. జగన్ జైలులు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతి సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారని విమర్శించారు. జగన్పై ఈడీ సహా అనేక కేసులున్నాయని, బెయిల్పై బయట తిరుగుతున్నారని చెప్పారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదామని.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. తానున్నాని వెల్లడించారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తామన్నారు. రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
మొరిగితే పట్టించుకోనని, అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు అనుభవించింది చాలని, మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ప్రజలపై అడ్డగోలుగా పన్నులు విధిస్తున్నారని.. చివరికి పీల్చే గాలిపై కూడా ట్యాక్స్ వేస్తాడని ఎద్దేవా చేశారు. ఉన్న సంస్థలను విధ్వంసం చేసి యువతను గంజాయికి బానిసను చేశారన్నారు.
ఇలాంటివి ఎన్నో చూశామని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చాలకృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారని, చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని కుట్రపన్నారని చెప్పారు.