కృష్ణా జిల్లా: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల క్రితం సముద్రంలో నలుగురు మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లుగా వారివారి బంధువులకు ఫోన్లో సమాచారం అందించారు. వీరి ఆచూకీ కనిపెట్టేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగి హెలికాప్టర్లతో గాలించి చివరకు పట్టుకోగలిగారు. వీరంతా అమలాపురం కొత్తపాలెం వద్ద క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
జూలై 3న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మచిలీపట్నంలోని కాంబెల్పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సోమవారం అదృశ్యమయ్యారు. వీరి వద్ద ఉన్న ఒక మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో సమాచారం తెగిపోయింది. తమ వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారు గల్లంతైనట్లుగా అనుమానించి పోలీసులు, కోస్ట్గార్డ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాంతో నౌకాదళం, కోస్ట్గార్డ్, విపత్తు నిర్వహణ బృందాలు మంగళవారం నుంచి హెలికాప్టర్లతో వెతకడం ప్రారంభించి బుధవారం కూడా వెతికాయి. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రెండు హెలికాప్టర్లు కాకినాడ-విశాఖపట్నం మధ్య వీరి ఆచూకీని కనిపెట్టేందుకు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. అలాగే, రెండు పడవలను కూడా రంగంలోకి దించారు.
ఎట్టకేలకు వీరి శ్రమ ఫలించి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ దొరికింది. అమలాపురం కొత్తపాలెం వల్ల క్షేమంగా ఉన్నాట్లు గుర్తించారు. ఫోన్లో వారి బంధువులకు సమాచారం అందించారు. గల్లంతైన మత్య్సకారులు చిన్న మస్తాన్, నాంచారులు, నరసింహారావు, వెంకటేశ్వరరావుగా గుర్తించారు. మత్స్యకారులు క్షేమంగా కనిపించడంతో వారి కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. తమ వారి ఆచూకీ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరంతా ఇవాళ సాయంత్రానికి ఇళ్లకు చేరుకోనున్నారు.