అమరావతి : ల్యాండ్ అండ్ టైటిలింగ్ (Land and Titling ) చట్టంపై దుష్ప్రచారం (Misinformation) చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు , వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏళ్లతరబడి రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీ (BJP)ని చంద్రబాబు ప్రశ్నించాలని సూచించారు. కాని వైసీపీ (YCP) పై దుష్ప్రచారం చేయడం రాజకీయ కుతంత్రలకు నిదర్శనమని అన్నారు. ఈ చట్టంపై ఏపీ బీజేపీ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్పై బీజేపీ విధానాన్ని స్పష్టం చేయాలని కోరారు. రాజకీయ జీవితంలో ఏనాడు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే అలవాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేదని , ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ సహకారం లేదని పేర్కొన్నారు.
ఎక్కడైనా కూటమిలోని అందరికి ఆమోదయోగ్యమైతేనే మేనిఫెస్టో (Manifesto) ను విడుదల చేస్త్రారని, అందుకు భిన్నంగా ఏపీలో పరిస్థితి ఉందని, దీనిని ప్రజలు ఏ విధంగా అర్ధం చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, అందరికీ ఇస్తారా, కొందరికి ఇస్తారా వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో చేయగలిగినవే పెట్టామని స్పష్టం చేశారు. అబద్దాలతో మోసం చేసే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గుర్తు చేశారు . రాష్ట్రంలో పింఛన్దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చంద్రబాబు కారకుడని విమర్శించారు.