విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవగా.. తమ ప్రభుత్వం మాత్రం ఆయనపై ఉన్న గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెలుగొంది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్టీరామారావు పేరును ఒక జిల్లాకు పెట్టడం సముచితంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ జిల్లాల సంఖ్యను పెంచారన్నారు. జిల్లాల పెంపుతో పాలన ప్రజలకు మరింత దగ్గరవుతుందని, అన్నీ ప్రాంతాల అభివృద్ధి సులభం అవుతుందని అన్నారు.
గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ప్రజల ఇంటి ముంగిటకు వెళ్ళిందని, జిల్లాల పెంపుతో మరింత దగ్గరగా వెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఉన్నా30 రోజుల గడువులోగా ప్రభుత్వానికి చెప్పొచ్చునని, ప్రజలు చెప్పే సమస్యలపై ప్రభుత్వం ఆలోచన చేసి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటుదన్నారు.