తాడేపల్లి : రాష్ట్ర ప్రజలను వంచించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఏదీ చేయడం లేదని అనడం నిజంగా వారి బుద్ధిలేనితనానికి నిదర్శనమన్నారు. రైతులు, మహిళలు, యువతకు అందజేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్ వెన్నంటే నిలిచారని ఆమె పేర్కొన్నారు. బుర్రలేని లోకేశ్ తనకు కొడుకుగా ఎలా పుట్టాడని జగన్ను చూసిన ప్రతి క్షణం చంద్రబాబు ఏడుస్తుంటాడని తీవ్రంగా ఎద్దేవా చేశారు.
రైతులకు మద్దతు ఇస్తున్నామంటూ ఎడ్ల బండిని లాక్కొని నారా లోకేశ్ను చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. దేశంలో రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే అని.. ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెప్తారని ఆమె దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు కుమారుడు ఇవాళ జగన్ను రైతు ద్రోహి అనడం బాధేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 39 నెలల్లోనే 39 ఏండ్లుగా రైతులు పడుతున్న కష్టానికి పుల్స్టాప్ పెట్టి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించారని వెల్లడించారు. గత మూడున్నరేండ్లలో రైతుల కోసమే రూ.1.27 వేల కోట్లు ఖర్చు చేశామని, వీటిలో రూ.83 వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించామని, రూ.43 వేల కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చించామని తెలిపారు. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని, ఆయన మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులను జగన్కు ఇచ్చి వెళ్లారని ఆరోపించారు.
నారా లోకేవ్ పార్టీలోకి రావడంతోనే టీడీపీ పతనం మొదలైందని రోజా అన్నారు. ఆయన ఏనాడైనా టీడీపీ జెండా పట్టారా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అని ప్రశ్నించారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రిపదవి కట్టబెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కేవలం అధికార దాహం తప్ప మరోటి కాదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని, రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని నారా లోకేశ్ ఏవిధంగా తింగరోడి మాదిరిగా ఏదో చేస్తున్నానని చెప్పి మరేదో చేసి నవ్వులపాలవుతున్నారని దుయ్యబట్టారు.