అమరావతి: పీఆర్సీ పై ఉద్యోగులు చర్చలకు వచ్చే దాకా వేచి చూస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. చర్చలకే రాకుండా సమస్య పరిష్కారం కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఉద్యోగులు కోరినట్లే ప్రభుత్వం సంప్రదింపులు కమిటీ వేసిందని చెప్పింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్ని నాని తెలిపారు. రిపబ్లిక్ డే తర్వాత చర్చలకు రావాలని ఆహ్వానించినా రాలేదన్నారు. వ్యక్తిగతంగా తాము కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.
ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నది తప్పా? ఉద్యోగులు చెప్తున్నది తప్పా? అన్నది తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయాలనే ఆలోచిస్తుందని చెప్పారు. ఇతర ఆలోచనలు మానుకొని చర్చలకు వస్తే ఫలితం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు చర్చలకు వచ్చేంత వరకూ తాము వేచి చూస్తుంటామని పేర్ని నాని చెప్పారు.