అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబు (Chandrababu Naidu) మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్టకరమని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లుగానీ, ఆయన శ్రీమతి పేరుగానీ ఎవరూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆమెను పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. అయినా దూషించారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కుటుంబ పరువును పణంగాపెట్టి మెలో డ్రామా క్రియేట్ చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలేనని మంత్రి విమర్శించారు.
ఇవతల ఉన్నవాళ్లు సంస్కారం లేనివాళ్లు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వ్యవస్థనీ, రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన వీడియోలు వైరల్ చేశారని, నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వీడియోలు చిత్రీకరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా దూషించినట్లు వారి దగ్గర ఆధారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జరగని విషయాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.