శ్రీబాలాజీ జిల్లా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పలమనేరు నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది కూడా ఆయన స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడి మరోసారి అధికారం అప్పగించాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికల హామీలను 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. వేల కోట్లు వెచ్చించి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టిన విషయాలేవీ చంద్రబాబుకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇంగ్లిష్ మీడియం విద్యను తీసుకొచ్చారని, తద్వారా విద్యార్థులు అనేక పోటీ పరీక్షల్లో రాణించాలని తపన పడుతున్నారన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాలు గెలుచుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో తమిళ నటుడు పోటీ చేస్తారన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు. 2024లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థి భరత్ ఒక్కరే అని, అలాగే పలమనేరు నియోజకవర్గం నుంచి వెంకటేగౌడ్కు ఓటు వేయాలని కోరారు. ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్న సీఎం జగన్కు మనమంతా అండగా నిలవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు.