అమరావతి: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలోసంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2022-23 కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఎయిర్ పోర్టులు, పోర్టుల వారీ ప్రగతిపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విశాఖపట్నం చెన్నై కారిడార్ పురోగతిపైనా మంత్రి ఆరా తీశారు. ఫిబ్రవరి 4వ తేదీన సమావేశమవ్వాలని, ఆ రోజుకల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు.
నెల్లూరు జిల్లా క్రిస్ సిటీ గురించి ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం వివరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిందని మంత్రికి స్పష్టం చేశారు. పరిశ్రమలలోని అన్ని విభాగాలు వేర్వేరు పోర్టల్ లను నిర్వహించు కుంటున్నాయని, సోషల్ మీడియా వేదికగా అన్ని విభాగాలను ఒకే వెబ్ సైట్ గా మార్చే ప్రక్రియను సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు.
ఈడీబీ,ఎమ్ఎస్ఎమ్ఈ, ఏపీఐఐసీ,మారిటైమ్ బోర్డుల వంటి అన్ని విభాగాలను పరిశ్రమల శాఖ వెబ్ సైట్ లో లింక్ ద్వారా ఓపెన్ చేసే వీలుగా వెబ్ సైట్ విండో తయారు చేయాలన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పై ప్రత్యేకంగా చర్చించేందుకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనతో సమావేశమయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు.