అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి అప్పల రాజుపై పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి అనుచరులు ఆందోళనను నిర్వహించారు. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శారదాపీఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు నిర్వహించారు. శారదాపీఠంలోకి వెళ్లేందుకు వచ్చిన మంత్రి అనుచరుల కారును బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులకు, మంత్రి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీఐ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహం చెందిన అనుచరులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని సీఐని అక్కడి నుంచి పంపించినప్పటికీ సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచరుల కారు వెనుకే ఉన్న మంత్రి అప్పలరాజు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సీఐ విషయం హోంమంత్రి వద్ద తేల్చుకుంటానని వార్షికోత్సవంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.