(Buggana Rajendranath) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా దూసుకుపోతున్నదని స్పష్టం చేశారు. 2019-20లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధి రేటు పెరిగిందని, అయితే కరోనా సంక్షోభం వల్ల భారీ ప్రభావాన్ని చూపిందన్నారు. ప్రతి రుణం, వ్యయానికి సంబంధించి ప్రభుత్వం వద్ద సవివరమైన లెక్కలున్నాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
2020-21 లో కొవిడ్ కారణంగా యావత్ ప్రపంచం శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని చవిచూసిందని మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ అన్నారు. విభజన సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో కొవిడ్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయన్న వాస్తవాన్ని మనమందరం గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి రేటు 2017-18లో 10.09 శాతం నుంచి 2018-19లో 4.88 శాతానికి పడిపోయిందన్నారు. అయితే, 2020-21 వాస్తవ జీఎస్డీపీ గణాంకాలకు వ్యతిరేకంగా ప్రస్తుత ధరల ప్రకారం ఆర్థిక వృద్ధిని లెక్కిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ వృద్ధి రేటు 2017-18లో 14.6 శాతం నుంచి 2018-19లో 10.11 శాతానికి తగ్గిందని మంత్రి బుగ్గన చెప్పారు. 2019-20లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 10.63 శాతంతో ఆకర్షణీయంగా మారిందని తెలిపారు. ఇది దేశంలో 3వ వేగవంతమైన వృద్ధి రేటు అని వెల్లడించారు.