ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్లపై మంత్రి బొత్స సత్యానారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎన్ని సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మరిచిపోయారా? అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో జరిగిన కాల్పులు ఎవరి హయాంలో జరిగాయి? అని సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రత్యామ్నాయాలు గానీ, నిర్మాణాత్మక సూచనలు గానీ చంద్రబాబు ఇవ్వలేదని, అలాంటివి ఇస్తే బాగుంటుందన్నారు. బషీర్ బాగ్ కాల్పులకు చంద్రబాబు కారకులు కాదా? అంటూ నిలదీశారు.
తాము ప్రజల అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో టీడీపీ పదే పదే విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చేస్తున్న అప్పులేమైనా తమ జేబుల్లోకి వస్తున్నాయా? లేదంటే పౌడర్లు, స్నోల కోసం వారి లాగా ఖర్చు చేశామా? అంటూ బొత్స ఫైర్ అయ్యారు. లక్షా 32 వేల కోట్లు నేరుగా ప్రజల అకౌంట్లలోకే జమ చేసిందని, ఇది వాస్తవం కాదా? అంటూ బొత్స ప్రశ్నించారు. అలాగే వైసీపీ చేస్తున్న దుర్మార్గాలపై తాము ప్రజల్లోకి వెళ్తామన్న టీడీపీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఇలా వెళ్తే ప్రజలు టీడీపీ నేతల చొక్కా పట్టుకుంటారని, తమ పాలనలో ఏం చేశారని సూటిగా అడుగుతారని అన్నారు.