ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ అరెస్ట్పై ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందని బొత్స ప్రకటించారు. ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే నారాయణ అరెస్ట్ అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ నేపథ్యంలో మంత్రి బొత్స ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు.
ఈ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్రపై పోలీసులు తేలుస్తున్నారని బొత్స పేర్కొన్నారు. అయితే.. అన్ని జిల్లాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, అరెస్టైన వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు కూడా ఉన్నారని వెల్లడించారు. అయితే… వీరిలో నారాయణ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారని వెల్లడించారు.
ఇక నారాయణ అరెస్ట్పై టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స మండిపడ్డారు. పేపర్ లీకేజీ అసలు జరగలేదని టీడీపీ నేతలు చెప్పగలరా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్లో అసలు అక్రమాలే జరగకుంటే పోలీసులు ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు.
తప్పు చేసిన వారెవర్నైనా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని బొత్స స్పష్టం చేశారు. తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో తాను తప్పు చేయలేదని నారాయణ నిరూపించుకోవాలని అన్నారు. ఇక… చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స పేర్కొన్నారు.