అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ నాయకులపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్ అధికార వైసీపీ నాయకులపై సెటైర్లు వేయొచ్చుకాని వైసీపీకి సెటైర్లు వేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదని పవన్కు హితవు పలికారు.
‘ మీకు స్క్రీన్ ప్లేనే వచ్చు.. మాకు సినిమా తీయడం కూడా వచ్చని’ ఎద్దేవ చేశారు. ‘నారావారి దత్తపుత్రుడు, బాబు గారి దత్తపుత్రుడని’ అని సినిమా తీయాలని అనుకుంటున్నామని, కాని సినిమాలో ఒక్క హీరోయిన్ సరిపోదని, ఐదారుగురు హీరోయిన్లు అవసరమని వ్యాఖ్యనించారు. అయితే నిర్మాతలు దొరకడం కష్టంగా ఉందని ఘాటుగా పవన్ ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, జగన్ను ఓడించాలని పవన్ రాజకీయ ప్రయాణం చేస్తున్నాడని విమర్శించారు.
దత్తపుత్రుడు కాకపోతే చంద్రబాబుకు ఎందుకు చాకిరి చేస్తున్నావని ప్రశ్నించారు. కాపులందరినీ చంద్రబాబు కాళ్లవద్ద పెడుతున్నావని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి , పోటీ చేసి గెలుపొందడానికి పవన్ ఆలోచన చేయడం లేదని, పొత్తులతో చంద్రబాబును గద్దె నెక్కించాలని జనసేన అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ధైర్యముంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.