తాడేపల్లి : విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. ప్రభుత్వం తీరుపై ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వ పెద్దలు తామేం తక్కువ తినలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అనిల్.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్పై ఘాటు విమర్శలు చేశారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్పై ఘాటు ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ పోస్టుకు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత పదునుగా సమాధానమిస్తున్నారు. చంద్రబాబుకు బుద్ధి లేదు.. బాలయ్యకు సిగ్గు లేదు.. లోకేష్కు బుర్రే లేదు అంటూ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు.
కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా! నీకు సిగ్గులేదయ్యా! అంటూ నిన్న అంబటి మరో ట్వీట్ చేశారు. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య.. అంటూ చేసిన ట్వీట్పై దుమారం రేగింది. మంత్రికి టీడీపీ నేతలు, నందమూరి అభిమానులు కౌంటర్ ఇచ్చారు. బాలయ్య గురించి మాట్లాడే హక్కు మంత్రి అంబటికి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తావో ముందు చెప్పవయ్యా అంటూ నిలదీస్తున్నారు.
బాబుకి బుద్ధి లేదు
బాలయ్యకి సిగ్గు లేదు
లోకేష్ కి బుర్రే…. లేదు!— Ambati Rambabu (@AmbatiRambabu) September 27, 2022
కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా !
నీకు సిగ్గులేదయ్యా!— Ambati Rambabu (@AmbatiRambabu) September 26, 2022
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!
— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2022