AP Politics | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ-జనసేన పొత్తులపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన ఈ తరుణంలో బీజేపీ కూడా వీళ్లతో కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏపీలో 2014 ఎన్నికల నాటి సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నాడు. దీనిపై చాలాసార్లు ప్రకటనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే సీట్ల పంపకాలపై కూడా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ నెల 5 వ తేదీ (సోమవారం ) దాదాపు 4 గంటల పాటు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు. అయినప్పటికీ ఇంకా కొలిక్కిరాకపోవడంతో ఇవాళ కూడా భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుతో పాటు ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశాలపై చర్చించారు. ఈ భేటీలో సీట్ల పంపకాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 8వ తేదీన మరోసారి భేటీ కావాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పొత్తులపై నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తులు కూడా చేస్తోంది. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడంపై ఇవాళ రాత్రిలోగా బీజేపీ అధిష్ఠానం ఒక స్పష్టతనిచ్చే ఛాన్స్ ఉంది.
బీజేపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపి పొత్తుల అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తారని సమాచారం. ఫిబ్రవరి 8వ తేదీన టీడీపీ, జనసేన భేటీ ఉన్న నేపథ్యంలో ఆలోపే బీజేపీతో పొత్తులపై క్లారిటీ తీసుకొని.. సీట్ల సర్దుబాటును ఖరారు చేసే అవకాశం ఉంది. అదే నిజమై.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య కుదిరితే 2014 ఎన్నికల నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.