Srisailam | తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రం అభివృద్ధికి సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ సీ విష్ణు చరణ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, ఆత్మకూరు డీఎఫ్ఓ సాయిబాబా, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, సర్వే ల్యాండ్ ఏడీ జయరాజు తదితర అధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం మహా క్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నివేదికలు పంపాలని గత సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన దేవాదాయ, పర్యాటక, ఆర్ అండ్ బీ మంత్రుల కమిటీ సమావేశంలో నిర్దేశించారన్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు అవసరమయ్యే నివేదికలను శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలని దేవాదాయ, అటవీ, సర్వే అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వచ్చే రెండేండ్లలో తిరుమల క్షేత్ర తరహాలో శ్రీశైలం క్షేత్రాన్నిఅభివృద్ధి చేసేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కలెక్టర్ జీ రాజకుమారి చెప్పారు. కనుక సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో నివేదికలు తయారు చేసి ఇస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో దేవాదాయ, అటవీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను కూడా పొందుపరచాలని సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీని ఆదేశించారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన అటవీ విస్తీర్ణం, అటవీ సరిహద్దుల సర్వే, గజిట్ నోటిఫికేషన్, నందికొట్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల నిషేధిత భూములు సంబంధిత వివరాలతో నివేదికలు అందజేయాలని డీఎఫ్ఓను కలెక్టర్ ఆదేశించారు.
శ్రీశైల దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములు, అటవీ సరిహద్దుల నుండి రక్షణ గోడలు, తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి నివేదికలను అందజేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి గతంలో మంత్రుల కమిటీ సూచించిన అంశాలు, తయారు చేసిన నివేదికలను కూడా అందజేయాలన్నారు. సున్నిపెంట నుండి శ్రీశైలం వరకు 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు ప్రతిపాదనలు, రహదారి విస్తరణ పనులు కూడా మాస్టర్ ప్లాన్ నివేదికలో పొందుపరుస్తామని కలెక్టర్ తెలిపారు.