కృష్ణా జిల్లా : మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. తానొక్కడినే లైంగికదాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ఎదుట నేరాంగీకారం చేసినట్లు సమాచారం. అయితే, రెండో నిందితుడిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంటున్నది. పోలీసులమంటూ తనను ఎత్తుకెళ్లిన ఇద్దరు తనపై లైంగికదాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మచిలీపట్నం పట్టణానికి చెందిన ఓ యువతి ఇటీవల రాత్రి సమయంలో పనిముగించుకొని ఇంటికి వెళ్తున్నది. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు పోలీసులమంటూ అటకాయించారు. ఎక్కడికెళ్తున్నావ్.. ఏం చేస్తుంటావ్.. అని దబాయించి అడుగుతూ బైక్ ఎక్కాలని బెదిరించారు. అందుకు యువతి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనక ఖాళీ స్థలంలోకి యువతిని తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు రికార్డు చేశారు. ఈ విషయం ఎక్కడైనా చెప్తే వీడియోలు బయటపెడతామంటూ బెదిరించారు. బాధితురాలి బ్యాగులోని ఫోన్ లాక్కుని ఉడాయించారు.
దారుణం జరిగిన మరుసటి రోజు తనపై లైంగికదాడికి పాల్పడిన వారిలో ఒకరు తన ఇంటి ముందు నుంచి వెళ్తుండగా గుర్తించింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో ఆ యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని సుకర్లాబాద్కు చెందిన నారాయణగా పోలీసులు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతిపై తానొక్కడినే లైంగికదాడికి పాల్పడినట్టూ నిందితుడు పోలీసులకు చెప్పడంతో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తనపై ఇద్దరు లైంగికదాడి చేశారని, రెండో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంటున్నది. కాగా నిందితుడి నుంచి యువతి సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడి మొబైల్ డాటాతో పాటు ఘటన జరిగిన ప్రాంతంలోనా కాల్ డాటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.