తిరుమల : మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2ను సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు అంకితభావంతో చేస్తున్న సేవలను కొనియాడారు. సుమారు 22 ఏళ్ల క్రితం టీటీడీ ప్రారంభించిన శ్రీవారి సేవలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవకులుగా పేరు నమోదు చేసుకున్న దాదాపు 13 లక్షల మంది భక్తులు తమ నిష్కళంకమైన సేవలను అందించినట్లు తెలుసుకోవడం గొప్ప విషయమన్నారు.
అన్నమయ్య, త్యాగయ్య, పురందర దాసు, వెంగమాంబ వంటి గొప్ప భక్తులు శ్రీవేంకటేశ్వరుని సేవలో మోక్షాన్ని పొందారని అన్నారు. ప్రతిరోజు తిరుమలకు లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నారని, అదేవిధంగా మంత్రాలయానికి కూడా 65 వేల మంది భక్తులు వస్తున్నట్లు తెలిపారు. యాత్రికుల రద్దీకి అనుగుణంగా మంత్రాలయంలో కూడా శ్రీవారి సేవ తరహాలో గురుపాద సేవ పేరుతో స్వచ్ఛంద సేవను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు, స్వామీజీ తన శిష్యులతో కలిసి శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వసతి, శ్రీవారి సేవా వలంటీర్లకు విధుల కేటాయింపు, జీడిపప్పు సేవ మొదలైన వాటిని పరిశీలించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ను సందర్శించి అన్న ప్రసాదాల తయారీ, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించడం, కూరగాయల నిల్వ, కూరగాయాలు జరిగే యంత్రాన్ని పరిశీలించారు.