అమరావతి: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. మంగళవారం ఆయన తాడేపళ్లిలో ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఆయనకు మంగళగిరిలో (Mangalagiri) పార్టీ గెలుపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. దీంతో పార్టీకి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న పీసీసీ చీఫ్ షర్మిళకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్కే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
అయితే పార్టీలో జాయిన్ అయిన మొదటి రోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఆ భేటీకి ఆర్కేను పిలువలేదని, కనీసం లోపలికైనా పిలుస్తారని చాలా సమయం గేటు వద్దే వేచి చూసిన ఆయన కోపంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తున్నది. దీంతో కాంగ్రెస్పై ఆయన కినుకవహించారని, ఇది గ్రహించిన విజయసాయి రెడ్డి మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి వచ్చేందుకు ఆర్కే కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.