విశాఖ: ఆంధ్రప్రదేశ్లో దోపిడీ దొంగ కలకలం సృష్టించాడు. పట్టపగలే బ్యాంకులోకి దూరి తుపాకీతో బెదిరించి అందినకాడికి దోచుకున్నాడు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే .. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నర్సింగబిల్లిలో ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులోకి ప్రవేశించిన దొంగ.. బ్యాంకు క్యాషియర్ను తుపాకీతో బెదిరించాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న దాదాపు రూ.3.3 లక్షల నగదును లాక్కొని పరారయ్యాడు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితోపాటు ఖాతాదారులు భయపడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఘటనా స్థలాన్ని ఎస్పీ గౌతమి శాలి పరిశీలించారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి ఖాతాదారు మాదిరిగా భుజానికి బ్యాగ్ తగిలించుకుని, తలకు హెల్మెట్ ధరించి వచ్చినట్లు సిబ్బంది పోలీసులకు తెలిపారు. దోపిడీ అనంతరం పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బ్యాంకు సీసీ ఫుటేజ్తో పాటు నర్సింగబిల్లిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉత్తరాదికి చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ తుపాకీతో తిరిగినట్టు గుర్తించారు. నిందితుడు వాడినది డమ్మీ పిస్టల్ లేదా తపంచాగా పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ, పాయకరావుపేట వైపు వెళ్లే రహదారుల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.