కర్నూలు: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో.. శ్రీశైలంలో ఆర్జిత సేవలతో పాటు మల్లన్న స్పర్శ దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కరెంట్, ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నాడు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారు అశ్వవాహనంపై కొలువుదీరి పూజలందుకున్నారు. రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయణోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా ఏకాంత సేవతో 11 రోజుల పాటు వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా, రేపటి నుంచి రోజుకు మూడుసార్లు సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు.
ఇవాల్టి నుంచి మల్లన్నస్వామి స్పర్శ దర్శనం చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో స్పర్శ దర్శనంను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శ వినిపించింది. బ్రహోత్సవాలు ముగియగానే తిరిగి స్పర్శదర్శనం ప్రారంభించారు.