Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతి రోజూ విశేష పూజలు ఉంటాయని చెప్పారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలతోపాటు ప్రత్యేక పూజాధికాలు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
మకర సంక్రమణం రోజున ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ పెద్దిరాజు అన్నారు. ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనోత్సవ సేవ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల ఆర్జిత, పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.
మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో భోగి పర్వదినాన ఉదయం 10 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదేండ్ల వయస్సులోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే సంక్రాంతి పండుగ రోజు మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ముగ్గుల పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో స్థానికులతోపాటు భక్తులు కూడా పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు.
యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ.
భృంగివాహన సేవ, ప్రాకారోత్సవం.
రావణవాహన సేవ.
నందివాహన సేవ, కళ్యాణ మహోత్సవం.
కైలాస వాహన సేవ
రుద్ర చండీయాగాలకు పూర్ణాహుతి,
త్రిశాలస్నానం, ధ్వజావరోహణ
అశ్వవాహన సేవ ఆలయోత్సవం,
పుష్పోత్సవ, శయనోత్సవసేవా కార్యక్రమం.