శ్రీశైలం / నంద్యాల : మార్చి 1వ తేదీ నుంచి11వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను (Mahashivratri Brahmotsavam) విజయవంతం చేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్కుమార్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూములో శివరాత్రి ఉత్సవాలపై భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై నోడల్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి భక్తుడు స్వామిఅమ్మవార్ల దర్శనం(Darsan) చేసుకుని సంతృప్తికరంగా వెళ్లే రీతిలో సౌకర్యాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దాదాపు 6 లక్షల మంది భక్తులు(Devotees) వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా వెంకటాపురం నుంచి శ్రీశైలం ఆలయానికి దాదాపు 2 లక్షల మంది పాదయాత్ర భక్తులు వచ్చే అవకాశం ఉందని, మార్గమధ్యలో 13 మెడికల్ క్యాంపులు(Medical Camps) ఏర్పాటు చేసి అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. క్షేత్రపరిధిలో భక్తులు అత్యవసర వైద్యానికి గురైనప్పుడు 108 అంబులెన్సులతో పాటు బైక్ అంబులెన్సుల ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవోకు సూచించారు. తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ (Traffic) అంతరాయం లేకుండా ప్రణాళికలతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్లేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సమాచారం నిమిత్తం హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని భక్తులకు తెలపాలన్నారు.
పకడ్బంధీగా పారిశుధ్య చర్యలు..
శ్రీశైల క్షేత్రపరిధిలో 13 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామని జేసీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రతీరోజు 400 మంది పారిశుద్ధ్య సిబ్బందితో, 8వ తేది నుంచి 11వ తేదీ వరకు వెయ్యి మంది శానిటేషన్ సిబ్బందితో 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసేలా చర్యలు తీసుకుకోవాలని పంచాయతీ, డిప్యూటీ సీఈవోను ఆదేశించారు.
చెక్పోస్టుల వద్ద ఎలాంటి రుసుము తీసుకోవద్దు..
అటవీశాఖ పరిధిలో ఉన్న చెక్పోస్టులను మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎలాంటి రుసుము తీసుకోకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను ఆదేశించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులతో కలిసి భక్తుల క్యూ లైన్ లు, టోల్గేట్, వలయ రహదారి ( రింగురోడ్డు) యజ్ఞవాటిక, పార్కింగు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర అజాద్, శ్రీశైల దర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధి కారి డి. పెద్దిరాజు అధికారులు పాల్గొన్నారు.