తిరుపతి: పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన నిర్వహించారు. అనంతరం 8.45 గంటల వరకు కటక లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందించారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. దాంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ వకుళమాతను దర్శించుకుని తరించారు.
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు ప్రశంసలు
డ్రైఫ్లవర్ టెక్నాలజీతో టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫొటో ప్రేమ్లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన.డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారుచేసిన వస్తువులను పరిశీలించి, నిర్వాహకులను ప్రశంసించారు.
టీటీడీకి చెందిన వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో డ్రైఫ్లవర్ టెక్నాలజిని ఉపయోగించి శ్రీవారు, అమ్మవార్ల ఫొటో ప్రేమ్లు, పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో గత ఏడాది సెప్టెంబరు 13వ తేదీన ఎంఓయూ కుదిరింది.