అమరావతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం 43వ రోజుకు చేరుకుంది. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపు 42 రోజుల పాటు విజయవాడ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా కొనసాగిన పాదయాత్రకు ఆయా జిల్లాకు చెందిన రైతులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలని కోరుతూ వేలాదిమంది రైతులు అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. రైతులు, ప్రజా సంఘాలు అమరావతి పరిరక్షణ పేరిట జేఏసీగా ఏర్పడి మహాపాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్ర ఈనెల 17న ముగియనుంది.
ఈ సందర్భంగా ముగింపు రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావించినప్పటికినీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో హైకోర్టుకు వెళ్లి బహిరంగ సభకు అనుమతి తీసుకోవాలని, లేని పక్షంలో ఏపీలోని అన్ని నియోజకవర్గంలో సంఘీభావ సభలు, ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు.