Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే మహాకుంభాభిషేక మహోత్సవ సమయంలో సిబ్బంది తమకు అప్పగించిన ప్రత్యేక విధులను బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా నిర్వహించాలని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం అన్న ప్రసాద వితరణ భవన సముదాయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో దేవస్థానం ఈవో డీ పెద్ది రాజు, వైదిక కమిటీ సభ్యులు తదితరులతో కలిసి మహా కుంభాభిషేకం ఏర్పాట్లను సత్యనారాయణ సమీక్షించారు. ఇప్పటికే రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా సిబ్బంది తమ విధులకు హాజరు కావాలని చెప్పారు.
లోక కల్యాణం కోసం జరిపే ఈ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం ఎంతో అద్రుష్టంగా భావించాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. మహా కుంభాభిషేక మహోత్సవంలో పీఠాధిపతులు, పలువురు ప్రముఖులు పాల్గొంటారని అన్నారు. వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సిబ్బంది తమ విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా విధుల నిర్వహణలో సమయ పాలన పాటించాలన్నారు.ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం జరిగే గర్భాలయ విమానాలు, ఆలయ గోపురాలు, అన్ని ఉపాలయాల గోపురాలు, పరివార ఆలయాలు తదితర అన్ని చోట్ల కూడా దేవస్థానం సిబ్బందిని సమన్వయ అధికారులుగా నియమించాలని ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి ప్రదేశంలోనూ ఒక సమన్వయ అధికారి ఉండాలని స్పష్టం చేశారు.
కుంభాభిషేక సమయంలో ఆలయ వేళలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ ఉండాలని ఎస్ సత్యనారాయణ అన్నారు. మహా కుంభాభిషేకాన్ని భక్తులు వీక్షించడానికి వీలుగా క్షేత్ర పరిధిలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల వివరాలను కూడా ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు తెలుపాలన్నారు.
దేవస్థానం అధికారులు మాట్లాడుతూ శ్రీశైల టీవీ ద్వారా మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిగతా చానెళ్లు కూడా మహా కుంభాభిషేకాన్ని ప్రసారం చేయడానికి శ్రీశైలం టీవీ ద్వారా క్లీన్ ఫీడ్ కూడా అందజేస్తామన్నారు. అంతకుముందు కమిషనర్ సత్యనారాయణకు దేవస్థానం అధికారులు మహా కుంభాభిషేకం ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల వివరాలు తెలిపారు.