Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు 11 రోజులు జరుగుతాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం ప్రాథమిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం సహాయ, సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ క్రుషి చేయాలని సూచించారు. దేవస్థానం ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలని చెప్పారు. దేవస్థానం పరిధిలోని విభాగాల వారీగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధిపతులకు, పర్యవేక్షకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి గత ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గతేడాది ఉత్సవాల డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు మాట్లాడుతూ వైదిక సిబ్బంది, ఆలయ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవాల్లో జరిగే కైంకర్యాలన్నింటికి ఎలాంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలు పరిపూర్ణంగా నిర్వహించాలని చెప్పారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారిని ఆదేశించారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధిపతులను ఆదేశించారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ ముందస్తుగానే చేపట్టి పూర్తి చేయాలని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందిని ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించి కార్యాలయంలో సమర్పించాలన్నారు. యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా ఏర్పాట్లు వెంటనే చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికల్లా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయంలో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఉత్సవాల్లో ఆయా కైంకర్యాలను సమర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని సిబ్బందిని ఈఓ పెద్దిరాజు ఆదేశించారు.
పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి తదితర ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అటవీ శాఖ సహకారంతో నడకదారిలో వచ్చే భక్తులను ఆయా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు అవసరమైన ఏర్పాట్లపై సిబ్బందికి, వివిధ విభాగాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
మహా శివరాత్రికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడానికి ఆరుబయలు ప్రదేశాల్లో పైప్ పెండల్స్, షామియానాలు తదితర వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. తాత్కాలిక వసతి ప్రదేశాల్లో తగినన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని అన్నారు. తాత్కాలిక వసతి ప్రదేశాల్లో తప్పనిసరిగా మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దర్శనం కోసం వేచి చూసే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం తదితరాలు అందజేయాలని అన్న ప్రసాద వితరణ విభాగం అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లన్నీ ధ్రుడంగా ఉండేలా ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ప్రజా సౌకర్యాలు (మూత్రశాలలు, మరుగుదొడ్లు) అవసరమైన మరమ్మతు పనులు పూర్తి చేసి, అవన్నీ వినియోగంలోకి వచ్చేలా తగు ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్యం విభాగం అధికారులను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల అదనపు కుళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెప్పారు.
పార్కింగ్ ఏర్పాట్లు, సామానులు భద్రపరుచు గది, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ఇంజినీరింగ్ అధికారులు, భద్రతా విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. గతేడాది కంటే ఎక్కువగా ఈసారి అదనపు ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పార్కింగ్ ప్రదేశంలోనూ తగినంత విద్యుద్దీపాలంకరణ ఉండాలని చెప్పారు. పార్కింగ్ ప్రదేశానికి సమీపంలోనే శౌచాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆత్మకూర్ డీఎస్పీ శ్రీనివాసరావును ఈఓ పెద్ది రాజు కోరారు. పాతాళ గంగలోనూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పాతాళ గంగలో సేఫ్టీ మెష్ (రక్షణ కంచె), పాతాళ గంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాటు, పాతాళ గంగ మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మతు పనులు పూర్తి చేయడంపై శ్రద్ద వహించాలన్నారు. పాతాళ గంగలోని శౌచాలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆదేశించారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ పండుగ వాతావరణం నెలకొనే విధంగా విద్యుద్దీపాలంకరణ ఏర్పాట్లు చేయాలని ఎలక్ట్రికల్ డిప్యూటీ ఇంజినీర్ను ఆదేశించారు. ఆరు బయలు ప్రదేశాల్లో తగినంత విద్యుద్దీపాల ఏర్పాటు ఉండాలని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులను ద్రుష్టిలో పెట్టుకుని సమాచార బోర్డులు, సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగం, సంపాదకులను ఆదేశించారు.
క్షేత్ర పరిధిలో భక్తులకు సమాచారం చేరవేసేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని పీఆర్ఓను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. ఉత్సవాల వేళ.. ఆకర్షణీయంగా పుష్పాలంకరణ ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్క్రుతి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పీఆర్ఓను ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లను సిబ్బందికి వివరించారు. క్షేత్ర పరిధిలో చేపట్టాల్సిన వైద్యఆరోగ్య వసతుల వివరాలను మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వివరించారు.
ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఓ మధుసూధన్ రెడ్డి, సహాయ కమిషనర్ హెచ్ జీ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామక్రుష్ణ, మురళీధర్ రెడ్డి, యూనిట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక డిప్యూటీ తహశీల్దార్ ఎం కిశోర్ కుమార్, డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం సీఐ ఎం దివాకర్ రెడ్డి, వన్ టౌన్, టూ టౌన్ ఎస్ఐలు లక్ష్మణ్ రావు, గంగయ్య యాదవ్, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యులు వాణి, సహనాజ్, సీహెచ్ఓ రామారావు, దేవస్థానం వైద్యశాలలో పని చేస్తున్న అపోలో వైద్యులు పాల్గొన్నారు.