Srisailam | ప్రఖ్యాత ద్వాదశజ్యోతిర్లింగము అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు, ఈఓ డీ పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సంప్రదాయ బద్దంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లుతో ఆలయ ప్రవేశం చేసి యాగశాలలో పూజాకార్యక్రమాలు చేశారు. వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శివ సంకల్పాన్ని పఠించారు. అతివృష్టి, అనావృష్టిని నివారించి, పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ, పుణ్యవాచనం, చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాలు జరిపించారు.
సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవ ధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా చేశారు. ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనమైన నందీశ్వరుని ప్రతిమ, అష్ట మంగళాలను చిత్రించిన నంది ధ్వజ పటాన్ని ధ్వజస్తంభంపై పతాకావిష్కరణగా నూలు తాడుతో పైకి ఎగురవేసేందుకు సిధ్దంచేసి ఉరేగింపు నిర్వహించారు. చండీశ్వరస్వామి సమక్షంలో ప్రత్యేక పూజాధికాలు చేశారు.
తదుపరి భేరిపూజతో మేళతాళాల రాగాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీ అని ప్రధాన అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చే యక్ష, గంధర్వ గణాలకు ఆలయ ప్రాంగణంలో నిర్ణీత స్థలాలు కేటాయించి నిత్యోత్సవ పూజలు జరిపిస్తారని స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్ వీ నాగేశ్వరరావు పట్టు వస్త్రాలను సమర్పించారు.