Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈఓ డీ పెద్దిరాజు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైలాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదని చెప్పారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో అన్ని సత్రాల నిర్వాహకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అన్ని సత్రాల వారు భక్తులకు సేవా దృక్పథంతో సేవలు అందించాలన్నారు. సత్రాలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్ సీ గుర్రప్ప, డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ కుమార్, స్థానిక సీఐ ప్రసాదరావు, ఎస్సై లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు దిగిన చోట నుంచి ఆయా కూడళ్లకు వెళ్లేందుకు దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తుందని ఈఓ పెద్దిరాజు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయన్నారు. అన్ని సత్రాల నిర్వాహకులు బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే భక్తులకు సేవలందించేందుకు అవసరమైన సరుకులు, సామాగ్రి తదితరాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి సత్రం నిర్వాహకులు కూడా శుచీ శుభ్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సత్ర ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అన్ని సత్రాల నిర్వాహకులు కూడా తగినంత మేరకు చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవాలని ఈఓ పెద్దిరాజు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా అన్ని సత్రాల నిర్వాహకులు తగినంత స్థాయిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అన్నదానం కోసం వంటకాలు వండుతున్నప్పుడు, అన్నదానం సమయంలో కూడా శుచీశుభ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సత్రాల నిర్వాహకులకు సూచించారు.
భక్తులతో సత్రాల్లో పని చేసే సిబ్బంది మర్యాదగా మెలగాలని ఈఓ పెద్దిరాజు హితవు చెప్పారు. సత్రాల్లో విధులు నిర్వహిస్తున్న కౌంటర్ సిబ్బంది, అన్నదానం సిబ్బందికి సత్రాల యాజమాన్యాలు తగు సూచనలు చేయాలని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని సత్రాల యాజమాన్యాలు కూడా ముందస్తుగానే నీటి ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసుకోవాలని అన్నారు. దేవస్థానం నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తుందని వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని దేవస్థానం దృఢ నిశ్చయంతో ఉందని ఈఓ పెద్దిరాజు చెప్పారు. ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడానికి సత్రాల నిర్వాహకులు కూడా సహకరించాలని అన్నారు. సత్రాల్లో వసతి పొందే భక్తులకు ఈ విషయమై సత్రాల నిర్వాహకులు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
శ్రీశైలం సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ భద్రతపై పలు సూచనలు చేశారు. భక్తులకు వసతి కల్పిస్తున్న సత్రాల యాజమాన్యాలు వారి గుర్తింపు పత్రాలను విధిగా పరిశీలించాలని చెప్పారు. భక్తుల ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుల ద్వారా వారిని గుర్తించి రిజిస్టర్లో పేర్లు నమోదు చేయాలన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సత్రాల ప్రతినిధులందరికీ స్వామి వార్ల శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో లడ్డూ పాక శాలకు హైదరాబాద్ లోని వివిన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కు చెందిన బీ పర్వతయ్య రూ.30 లక్షల విలువ గల అల్యూమినియం, స్టీల్ పాత్రలను అందజేశారు. వీటిలో 20 అల్యూమినియం పాకం గిన్నెలు, 30-బూంది గిన్నెలు, 17-స్టీల్ పెద్ద కురిపీలు, 11 స్టీల్ పెద్ద కురిపీలు, 2 స్టీల్ పొయ్యిలు, మిక్సి జార్, 19-స్టీల్ బూందీ పలుకలను అందజేశారు. లడ్డూ ప్రసాద తయారీ పర్యవేక్షకులు రవి కుమార్, సీనియర్ అసిస్టెంట్ రాజులకు వీటిని అందజేశారు. వీరు గతంలో లడ్డూ తయారీ కోసం సిల్వర్, స్టీల్ పాత్రలు అందజేశారు.