తిరుపతి : గుంటూరు జిల్లా వెంకటపాళెంలో తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.
అంతకుముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. 7.50 నుంచి 8.10 గంటల మధ్య ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత బ్రహ్మఘోష, వేదశాత్తుమొర చేపట్టారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి, ఎంపీ సురేష్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, దేవాదాయ కమీషనర్ హరిజవహర్ లాల్,ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి క్రిష్టిన, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, మల్లాడి కృష్ణారావు, జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఓలు గుణభూషణ్రెడ్డి, విజయ సారథి, గోవింద రాజన్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
అతిథులకు సన్మానం
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ ముఖమండపంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందించారు. గవర్నర్కు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ సందర్బంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణం దారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దుశ్శాలువతో సత్కరించి పంచలు బహూకరించారు.