Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాకుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 21 వరకు ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ప్రధాన ఆలయంలోని శివాజీగోపుర పునర్నిర్మాణ ప్రారంభంతోపాటు సుమారు 90కిపైగా ఉన్న ఉపాలయాలు, మూడు పంచమఠాల పునరుద్ధరణ, కొన్ని ఆలయాల పునరుద్ధరణ, ఆయా మఠాల్లో శివలింగ, నందీశ్వడిని ప్రతిష్ఠించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
ఉదయం మహా కుంభాభిషేక మహా సంకల్పంతో ప్రారంభమై గణపతిపూజ దీక్షాధారణ, పర్యగ్నికరణం, యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపిస్తామన్నారు. మహా కుంభాభిషేకం జరిగే ఆఖరి రోజున శాంతి, పౌష్టిక హోమం, మహా పూర్ణాహుతి అనంతరం పునరుద్ధరణ ఆలయాల్లో యంత్రస్థాపన, శివలింగ, నందీశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ, శివాజీ గోపురంపై సువర్ణ కలశ ప్రతిష్ఠ, ఉభయ దేవాలయ గర్భాలయ విమానాలు, గోపురాలకు మూలమూర్తులకు మహాకుంభాభిషేకం జరిపించనున్నట్లు ఈవో వివరించారు. మహోత్సవాలకు పలు ధార్మిక సంస్థలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధకులను ఆహ్వానించినట్లు తెలిపారు.